నేను ఈ రోజుకోసం అందరికి ఇష్టమైన పూర్ణాలు లేదా బూరెలు చేద్దామనుకుంటున్నా.
ఇదిగో ఈ వస్తువులు రెడీగా పెట్టుకోండి మరి..
సెనగపప్పు – 2 కప్పులు , బెల్లం – 1 1/2 – 2 కప్పులు , యాలకుల పొడి – 1/2tsp , మినప్పప్పు – 1 కప్పు , బియ్యం – 2 కప్పులు ,నెయ్యి – 1/2 కప్పు , నూనె – వేయించడానికి
సెనగపప్పు శుభ్రం చేసుకుని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించండి. చల్లారాక మెత్తగా మెదిపి , బెల్లం తురిమి అందులో కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి దగ్గర పడే వరకు ఉడికించండి. చివరలో యాలకుల పొడి, నెయ్యి వేయాలి. ఇందులో తడి అస్సలు ఉండకూడదు. లేకుంటే వేయించే సమయంలో నూనెలో విడిపోతుంది. బియ్యం, మినపప్పు కలిపి ఓ నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. కళాయిలో నూనె వేడి చేసి ఒక్కో ఉండను బియ్యం, మినపప్పుతోపులో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. అలా తినేయాలి. అంతే. ఇందులో పూర్ణం బెల్లం ,సెనగపప్పు అనే కాదు. ఎన్నో రకాలు గా చేయొచ్చు. తురిమిన కొబ్బరి, క్యారట్, డ్రైఫ్రూట్స్, బెల్లం కలిపి చేయొచ్చు. మీ ఇష్టం..